TTD’s Nitya Annadanam Scheme: భక్తుల పాలిట అక్షయ పాత్ర : టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం
టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం

TTD’s Nitya Annadanam Scheme: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తూ టీటీడీ సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది.
1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిర్వహించబడుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, వారాంతాల్లో ఈ సంఖ్య 3 లక్షలకు మించి ఉంటుంది.
రోజుకు 3 లక్షల సర్వింగ్స్
గత మూడు నెలల సగటు గణాంకాల ప్రకారం రోజుకు సుమారు 70 వేల మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలు అందిస్తున్నారు. అలాగే 60,200 మందికి అల్పాహారం, 99,500 మందికి మధ్యాహ్న భోజనం, 56,700 మందికి రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. ఈ విధంగా రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి.
ప్రధాన అన్నప్రసాద భవనం అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో రోజుకు 82 వేల మందికి పైగా భోజనాలు అందుతుండగా, శ్రీ అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కాంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు.
15.8 టన్నుల బియ్యంతో భక్తులకు నాణ్యమైన ఆహారం
భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం వినియోగిస్తున్నారు. అదేవిధంగా 3,110 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నారు. అలాగే రోజుకు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండు మిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి పదార్థాలు ఉపయోగిస్తున్నారు.
2026 జనవరి నుండి మే వరకు 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్
2026 జనవరి 1 నుండి మే 31 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4.40 కోట్ల సర్వింగ్స్ భక్తులకు అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో జనవరిలో కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్లో 85 లక్షలు, అలాగే మే నెలలో 92 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం, పానీయాలు అందించారు.
ఆధునికీకరణతో విస్తరిస్తున్న సేవలు
అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ పలు ఆధునిక చర్యలు చేపట్టింది. చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది.
అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన PAC-5 (వెంకటాద్రి నిలయం)లో సుమారు 1,500 మంది ఒకేసారి భోజనం చేసే సామర్థ్యంతో కొత్త డైనింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయి. MTVAC కిచెన్లో ఆధునిక వంట పరికరాల ఏర్పాటు, QR కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్క్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు.
రూ.2,500 కోట్లకు పైగా ఫిక్సిడ్ డిపాజిట్లు
భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధుల ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ టీటీడీ “అన్నదానం మహాదానం” అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తునికి తృప్తికరమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ అన్నప్రసాద సేవలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.
- Tirumala Tirupati DevasthanamsNitya AnnadanamTTDTirumalaFree MealsDevoteesAnnadanam SchemeTemple ServicesHindu DevotionSpiritual NewsPilgrimageTirupatiReligious ServiceBhaktiTemple TraditionSocial ServiceLatest Telugu NewsSpiritualityDevotional ActivitiesAkshaya PatraTirumala TempleReligious Welfare

