Vasanthotsavams at Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

Vasanthotsavams at Sri Padmavathi Ammavari Temple: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగాఅంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు రూ.150 చెల్లించి ఈ ఉత్సవాల్లో పాల్గొనవచ్చు. మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 వరకుస్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తారు. మరోవైపు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి మండపంలో ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, ఆస్థానం, అనంతరం బుగ్గ వద్ద ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

