Sri Prasanna Venkateswara Swamy: శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామి వారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
శాస్త్రోక్తంగా అంకురార్పణ

Sri Prasanna Venkateswara Swamy: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జులై 30వ తేదీన జరుగనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఉదయం ఆచార్య ఋత్విక్వరణం జరిగింది. సాయంత్రం 6.30 నుండి అంకురార్పణం నిర్వహించారు ఇందులో భాగంగా మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ చేపట్టారు.
జులై 30వ తేదీ గురువారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులు, ప్రధానార్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

