Dwajasthambam (Flagstaff): ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు?
ధ్వజస్తంభం ఎందుకు?

Dwajasthambam (Flagstaff): హిందూ దేవాలయాలకు ద్వజస్తంభం ఆలయత్వంను చేకూరుస్తుంది. ధ్వజస్తంభం ఉంటేనే అది పూర్తి దేవాలయంగా పరిగణించబడుతుంది; లేకపోతే కేవలం మందిరం అవుతుందని ఆగమ శాస్త్రం చెబుతోంది. ఆలయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఆగమ శాస్త్రం ప్రకారం, ఆలయ నిర్మాణంలో ధ్వజస్తంభం అనేది వెన్నెముక లాంటిది. గర్భగుడిలోని మూలవిరాట్టు (ప్రధాన దేవత) యొక్క శక్తి ధ్వజస్తంభం మీదుగా ఆలయ ప్రాంగణంలోకి, భక్తులపైకి ప్రసారం అవుతుందని నమ్ముతారు. దైవశక్తి మూలవిరాట్టుతో పాటు, ధ్వజస్తంభంలో కూడా ఉంటుందని చెబుతారు.
ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు లేదా ఇతర పండుగల ప్రారంభంలో ధ్వజస్తంభంపై ధ్వజారోహణం (జెండా ఎగురవేయడం) చేస్తారు. ఇది ఆయా దేవతలను, దేవతా గణాలను ఆలయ ఉత్సవాలకు ఆహ్వానించడానికి చిహ్నం. ఈ జెండాను చూడగానే దూరంలో ఉన్న భక్తులకు కూడా ఉత్సవాలు మొదలైన విషయం తెలుస్తుంది.
ధ్వజస్తంభం ఆలయ ప్రాంగణాన్ని ప్రతికూల శక్తుల నుండి, చెడు దృష్టి నుండి రక్షిస్తుందని పండితులు చెబుతారు. పూర్వకాలంలో, దట్టమైన అడవుల్లో లేదా దారి తప్పిన బాటసారులకు ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేయడానికి ధ్వజస్తంభంపై ఎత్తుగా దీపం (ఆకాశదీపం) వెలిగించేవారు.ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు, నేరుగా మూలవిరాట్టును దర్శించుకోకుండా, మొదట ధ్వజస్తంభం వద్దకు వచ్చి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి, సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అనేది భక్తులు తమ అహంకారాన్ని, గర్వాన్ని దేవుని ముందు పూర్తిగా వదులుకోవడానికి సంకేతంగా చేస్తారు. ధ్వజస్తంభం ముందు నమస్కారం చేయడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుందని, ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి అర్హులవుతారని నమ్ముతారు.
ధ్వజస్తంభం ఏర్పాటు వెనుక మయూరధ్వజుడు అనే దానశీలి అయిన రాజు కథ ప్రచారంలో ఉంది. పరమదాత అయిన మయూరధ్వజుని దాన గుణాన్ని పరీక్షించిన శ్రీకృష్ణుడు, అతని త్యాగానికి మెచ్చి, "నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభం వెలుస్తుంది. ముందు నిన్ను దర్శించి, ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు" అని వరం ఇచ్చాడని ఒక పురాణ కథనం చెబుతుంది. ధ్వజస్తంభం దైవత్వం, పవిత్రత, రక్షణ మరియు దానగుణానికి ప్రతీకగా హిందూ దేవాలయాల్లో నిలిచి ఉంది.








