Sri Vari Kalyana Talambaralu to Newlywed Couples: నూతన వధూవరులకు శ్రీవారి కల్యాణ తలంబ్రాలు ఉచితంగా పంపిణీ!
శ్రీవారి కల్యాణ తలంబ్రాలు ఉచితంగా పంపిణీ!

Sri Vari Kalyana Talambaralu to Newlywed Couples: నూతన వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అద్భుతమైన శుభవార్త అందించింది. పెళ్లి చేసుకునేవారికి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సదుపాయం పొందాలనుకునే నూతన దంపతులు తమ వివాహ తొలి శుభలేఖను టీటీడీకి పంపించాలి. వివాహానికి ఒక నెల ముందుగా పెళ్లి పత్రికను కింది చిరునామాకు పంపితే, శుభ ముహూర్తానికి సరిగ్గా స్వామివారి ప్రసాదం అందుతుంది.
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులను, నూతన దంపతులను ఎంతగానో సంతోషానికి గురిచేస్తోంది.
శుభలేఖ పంపించాల్సిన చిరునామా: కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి.
మరోవైపు తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు రావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీనివాసుని దర్శనం కోసం 17 కంపార్ట్మెంట్లలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం ఒక్కరోజే 60,098 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజే రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

