Sri Govindaraja Swamy Temple: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా బుగ్గోత్సవం
ఘనంగా బుగ్గోత్సవం

Sri Govindaraja Swamy Temple: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి మండపంలో ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, ఆస్థానం, అనంతరం బుగ్గ వద్ద ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

