Sri Kapileswara Swamy: శ్రీ కపిలేశ్వరస్వామివారికి వైభవంగా గ్రంధి పవిత్ర సమర్పణ
గ్రంధి పవిత్ర సమర్పణ

Sri Kapileswara Swamy: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం సుప్రభాత సేవతో శ్రీ కపిలేశ్వరస్వామివారిని మేల్కొలిపి, పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆగమ సంప్రదాయాల ప్రకారం నిత్యహోమం, గ్రంధి పవిత్ర సమర్పణ, మూలమూర్తులకు విశేష ఉపచారాలు ఘనంగా చేపట్టారు.
పవిత్రోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపాకటాక్షాలను పొందారు.
సాయంత్రం యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

