Tirumala Venkateswara Temple: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
పౌర్ణమి గరుడసేవ

Tirumala Venkateswara Temple: తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంతో, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

