Grand Sri Rama Pattabhishekam: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
శ్రీరామ పట్టాభిషేకం

Grand Sri Rama Pattabhishekam: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం బుధవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం యాగశాల పూజ, ఉదయం 6.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో శ్రీపట్టాభిరామస్వామి, సీతమ్మవారి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించారు.
అనంతరం శాస్త్రోక్తంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ అనంతరం శ్రీపట్టాభిరామస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

