Grand Teppotsavam: వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం
తెప్పోత్సవాలు ప్రారంభం

Grand Teppotsavam: తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి.
విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను కటాక్షించనున్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

