జగన్మోహనాకారుడు

Mohini Avatar: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీ‌నివాసుడు పల్లకీలో, తిరుచ్చిపై చిన్ని కృష్ణుడు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

పల్లకీ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలేనని స్వామి వారు తెలియజేస్తున్నారు. తన భక్తులుకానివారు ఈ జగన్మాయకు లోను కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.

వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ముని కుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

గ‌రుడ వాహ‌నం –

రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు కటాక్షించనున్నారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా దాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియచేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story