కనులపండువగా పుష్పయాగ మహోత్సవం!

Lord Kodandarama Adorned in Pushpavanam: కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయాన్నే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి మరియు నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ యాగం కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు సుమారు 3 టన్నుల రంగురంగుల పుష్పాలను విరాళంగా అందజేశారు. తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి రకరకాల పూలతో స్వామివారు మరియు అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. గర్భాలయం మొత్తం పుష్ప సౌరభంతో నిండిపోయి భక్తులకు కనువిందు కలిగించింది.

ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. అంతేకాకుండా, ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలలో తెలిసీ తెలియక జరిగే తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ యాగాన్ని చేస్తారని అర్చకులు తెలిపారు. ఈ యాగం వల్ల దోషాలు తొలగి అందరికీ శుభం కలుగుతుందని వారు వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story