జలాభిషేకానికి శుభ ముహూర్తాలివే..

Maha Shivaratri 2026: శివనామస్మరణతో మారుమోగే పవిత్ర పర్వదినం మహాశివరాత్రి వచ్చేస్తోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకునే ఈ పండుగకు హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పరమశివుడు నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి దర్శనమిచ్చాడని, అలాగే ఇదే రోజున శివపార్వతుల వివాహం జరిగిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఫిబ్రవరి 15నే మహాశివరాత్రి

ఈ ఏడాది చతుర్దశి తిథి వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రారంభం: ఫిబ్రవరి 15, సాయంత్రం 5:04 గంటలకు.

ముగింపు: ఫిబ్రవరి 16, సాయంత్రం 5:34 గంటలకు.

సనాతన ధర్మం ప్రకారం ఉదయ తిథి మరియు నిశిత కాల పూజకు ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 15న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను నిర్వహించుకోనున్నారు.

జలాభిషేకానికి శుభ సమయాలు

శివరాత్రి నాడు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఫిబ్రవరి 15న జలాభిషేకం చేయడానికి ఉత్తమ సమయాలు ఇవే..

సాధారణ శుభ సమయం - ఉదయం 08:24 నుండి 09:48 వరకు

లాభ - పురోగతి సమయం - ఉదయం 09:48 నుండి 11:11 వరకు

అమృత కాలం - ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 12:35 వరకు

సాయంత్రం శుభ ముహూర్తం - సాయంత్రం 06:11 నుండి రాత్రి 07:47 వరకు

రాత్రి వేళ నాలుగు జాములలో చేసే ప్రత్యేక పూజలకు కూడా విశేష ఫలితం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు.

పూజా విధానం - ప్రాముఖ్యత

మహాశివరాత్రి రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి, పవిత్ర స్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తుతారు.

ఉపవాసం -జాగరణ: ఈ రోజు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠించడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు.

అభిషేకం: శివలింగానికి నీరు, పాలు, తేనె, పెరుగుతో పాటు ముఖ్యంగా మారేడు దళాలను సమర్పించడం అత్యంత ఫలప్రదం.

శివపార్వతుల కలయికకు ప్రతీక అయిన ఈ పండుగ, మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ సదాశివుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆధ్యాత్మిక వేత్తలు కోరుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story