ఇవాళ ఏం చేయాలంటే?

Shivaratri Jagaran: శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూడదని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.
ఉపవాసాన్ని విరమించే ముందు ఇంట్లో శివునికి నైవేద్యం సమర్పించాలి. అలాగే దీపారాధన కూడా చేయాలి. వీలైతే పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అన్నదానం తర్వాత ఉపవాసం విరమిస్తే వచ్చే పుణ్యం అనంతం. పారణ చేసేటప్పుడు ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలని పండితులు సూచిస్తున్నారు. భగవంతునిపై మనసు లగ్నం చేసిన తర్వాత పాటించే ఈ పరిహారాలు అనంత పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే విరమణ తర్వాత కూడా ప్రశాంతంగా, భక్తితో ఉండాలి.
రోజంతా ఉపవాసం ఉన్నందున, విరమణ సమయంలో ఒకేసారి భారీ ఆహారం తీసుకోకూడదు. ముందుగా మంచినీరు, పండ్ల రసంతో కడుపుని తేలికపరచాలి. ఆ తర్వాత సాత్విక ఆహారమైన అన్నం, పప్పులు వంటి సులభంగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదని పండితుల సూచన.

