Sri Govindaraja Swamy’s Garuda Seva: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం రాత్రి నిర్వహించిన విశేష గరుడవాహనసేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.

సర్వాభరణ భూషితుడై, దివ్య కాంతులు వెదజల్లుతూ గరుత్మంతునిపై వెలసిన శ్రీ గోవిందుడు భక్తులకు కనువిందు చేశారు. “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయాయి.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనసేవకు విశిష్టమైన స్థానం ఉంది. గరుడవాహనంపై దర్శనమిచ్చే స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా వర్ణించారు. గరుత్మంతుని రెక్కలు వేదాల నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని కొనియాడారు.

గరుడుని సేవాభావం, మాతృభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి ఆదర్శప్రాయమని పండితులు పేర్కొన్నారు. జ్ఞానవైరాగ్యాలను కోరుకునే భక్తులు జ్ఞాన, వైరాగ్యరూపమైన రెక్కలతో విహరించే గరుడుని దర్శించి అభీష్టసిద్ధిని పొందుతారని విశ్వసిస్తారు. అందుకే గరుడసేవకు ఎనలేని మహిమ, విశిష్టత ఏర్పడ్డాయి.

భక్తి సంగీతాలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Next Story