Sri Narapura Venkateswara Swamy Brahmotsavams: కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 30న అంకురార్పణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వైభవంగా వాహన సేవలు:

మే 1వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ప్రధాన ఉత్సవాలు ఊపందుకోనున్నాయి. ఆ రోజు రాత్రి పెద్దశేష వాహన సేవ జరగనుండగా, వరుసగా హంస, ముత్యపుపందిరి, సింహ, కల్పవృక్ష మరియు హనుమంత వాహనాలపై స్వామివారు ఊరేగనున్నారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గరుడ వాహన సేవ మే 5న నిర్వహించనున్నారు. మే 6వ తేదీ సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం, రాత్రి గజ వాహన సేవ జరుగుతాయి. అనంతరం రథోత్సవం, అశ్వవాహనం, చక్రస్నానం వంటి ఘట్టాలు ముగిశాక మే 9న ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. మే 10వ తేదీ సాయంత్రం నిర్వహించే పుష్పయాగంతో వేడుకలు పరిసమాప్తమవుతాయి.

కల్యాణోత్సవ విశేషాలు:

మే 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.300/- టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డు, అప్పం మరియు అన్నప్రసాదాలను అందజేయనున్నారు. అలాగే, హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, భక్తి సంగీతం మరియు కోలాటాల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి.

ఆలయ విశిష్టత:

పెన్నానది తీరాన వెలసిన ఈ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. నారాపురయ్య అనే భక్తుడి కలలో స్వామివారు దర్శనమిచ్చి, మడుగులో లభించిన విగ్రహాన్ని ప్రతిష్టించమని కోరడంతో ఈ ఆలయం "శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి" క్షేత్రంగా పేరుగాంచింది. 1919లో పునర్నిర్మించబడిన ఈ ఆలయం, 2008 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధీనంలో ఉంటూ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.

Next Story