శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు

Srinivasamangapuram: తిరుపతి, 2025, జూన్ 25: తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

జూన్ 26న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించనున్నారు. ఉదయం 07 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన ఉదయం 11 – 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. సాయంత్రం 5 – 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

జూలై 01వ తేదీన ఉదయం 11 – 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 – 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు.

జూలై 02వ తేదీన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ అనంతరం, సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

జూలై 03న పార్వేట ఉత్సవం

జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం రద్దు చేశారు. జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం సేవలు రద్దు చేశారు. జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story