Srivari Salakatla Brahmotsavams: సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Srivari Salakatla Brahmotsavams: తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
• 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
• 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• 24-09-2025 ధ్వజారోహణం.
• 28-09-2025 గరుడ వాహనం.
• 01-10-2025 రథోత్సవం.
• 02-10-2025 చక్రస్నానం.
• ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు.
• బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
• వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు.
• విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
• భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.
• భక్తుల అవసరాలకనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశం.
• గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశం.
• భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశం.
• శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశం.
• 27-09-2025 రాత్రి 9 నుండి 29-09-2025 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.
• భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని ఆదేశం.
ఈ కార్యక్రమంలో డీఎఫ్వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, సీపీఆర్వో డాక్టర్ టి.రవి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీ రాజేంద్ర, శ్రీ సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, టీటీడీ ఆల్ ప్రాజెక్ట్స్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, ఈఈలు శ్రీ సుబ్రహ్మణ్యం, వేణు గోపాల్, డిఈ శ్రీ చంద్ర శేఖర్, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ శ్రీమతి కుసుమ కుమారి, ఎస్వీబీసీ ఓఎస్డీ శ్రీ పద్మావతి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీ.ఎల్.ఎన్. శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
