TTD: అదేవిధంగా, గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు, పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ (ఫేక్) వెబ్‌సైట్‌లను ఈ సంవత్సరం ఇప్పటివరకు టీటీడీ గుర్తించింది. వీటిపై 02 క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, సంబంధిత సంస్థల సహకారంతో ఆ వెబ్‌సైట్‌లన్నింటినీ తొలగించడం జరిగింది. ఆన్‌లైన్‌లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లు, లింక్‌ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది.

తిరుమలకు వచ్చే భక్తులు వాహనాల్లో నిషేధిత వస్తువులను తరలించకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు తనిఖీ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. నిషేధిత వస్తువులు గుర్తించిన సందర్భంలో అలిపిరి టోల్‌గేట్ స్కానింగ్ కేంద్రం వద్దనే వాటిని సీజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అలిపిరి వద్దనే 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పవిత్ర తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యత దృష్ట్యా డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి రికార్డింగ్ పరికరాలు పూర్తిగా నిషేధమని, వీటిని తీసుకురావద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్లు తదితర అంశాల్లో దళారులను నమ్మి భక్తులు మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచిస్తోంది. భక్తులను అప్రమత్తం చేసేందుకు టీటీడీ సామాజిక మాధ్యమాలు, ఎస్‌వీబీసీ, ప్రజా సంబంధాల విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టీటీడీ సూచనలు పాటించి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని టీటీడీ కోరుతోంది. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Next Story