Tirumala Tirupati Devasthanams (TTD): భక్తులను అలరించిన స్వరకర్త కోటి సంగీత విభావరి
సంగీత విభావరి

Tirumala Tirupati Devasthanams (TTD): తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు శనివారం సాయంత్రం నిర్వహించిన కోటి స్వరాల స్వర సంగమం సంగీత విభావరి కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. స్వరకర్త శ్రీ కోటి బృందం భక్తి గీతాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలను గానం చేస్తూ శ్రీవారి భక్తులను మైమరపించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీ కోటి గారి సంగీత విభావరి ఎంతోగానో ఆకట్టుకుందని చెప్పారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కార్యక్రమాలు వీక్షిస్తూ ఉంటారని అన్నారు. కోటి తండ్రిగారు సాలూరు రాజేశ్వరరావు టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా ప్రఖ్యాత గాయకుడు కీ.శే.ఘంటసాల వేంకటేశ్వరరావుతో కలిసి అనేక కచేరీలు చేశారని చెప్పారు. అద్భుతంగా కచేరీ నిర్వహించిన శ్రీ కోటీ మరియు ఆయన బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా నాదనీరాజనం వేదికపై ప్రత్యేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎస్వీబీసీ ఛానెల్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
జేఈవో డాక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రతి స్వరం, ప్రతి గీతం, ప్రతి రాగం స్వామివారికి సమర్పించిన శ్రీ కోటీ బృందానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అదనపు ఈవో సహకారంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకు ప్రతి శనివారం నిర్వహిస్తామని తెలియజేశారు.
అనంతరం ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో స్వరకర్త శ్రీ కోటి మరియ ఆయన బృందాన్ని శాలువాతో సన్మానించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

