Ramcharitmanas: రాజభవన భోగభాగ్యాలు, పట్టు వస్త్రాలు, రత్నాభరణాలను త్యజించి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి వెళ్లిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే. అయితే ఎలాంటి రాజరిక వనరులు, దర్జీలు లేదా స్వర్ణకారులు లేని ఆ దట్టమైన అడవిలో సీతామాత అలంకరణ ఎలా జరిగేది? ఆమెకు ఆభరణాలు ఎవరు సమకూర్చేవారు? అనే ఆసక్తికరమైన సన్నివేశాన్ని గోస్వామి తులసీదాస్ రచించిన శ్రీరామచరితమానస్ లోని అరణ్యకాండలో అత్యంత రమణీయంగా వర్ణించారు.

రామచరితమానస్‌లోని చతుష్పది ప్రకారం.. అరణ్యంలో సీతామాత కోసం ఆభరణాలను మరెవరో కాదు, స్వయంగా శ్రీరామచంద్రుడే తయారుచేసేవారు. అడవిలోని చెట్ల నుంచి సువాసనలు వెదజల్లే సున్నితమైన, రంగురంగుల పూలను తన చేతులతో కోసి తీసుకొచ్చి, వాటితో అందమైన పుష్పాభరణాలను తీర్చిదిద్దేవారు. చిత్రకూట పర్వత ప్రాంతంలోని స్వచ్ఛమైన స్ఫటిక శిలపై సీతామాతను కూర్చుండబెట్టి, అత్యంత గౌరవప్రేమలతో ఆమెను ఆ పూల నగలతో స్వయంగా అలంకరించేవారు. సీతాదేవి కూడా ఆ పుష్పాభరణాలను ఎంతో ఇష్టంగా, ఆనందంగా ధరించేవారని గ్రంథం పేర్కొంటోంది.

రాజభోగాలు, బంగారు నగలు లేకపోయినా ప్రకృతి ఒడిలో లభించే పువ్వులతో తన అర్ధాంగిని అలంకరించిన ఈ ఘట్టం శ్రీరాముడు, సీతామాతల మధ్య ఉన్న నిష్కల్మషమైన ప్రేమకు, అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. గోస్వామి తులసీదాస్ శ్రీరాముడిని కేవలం ఆదర్శ పుత్రుడిగా, సోదరుడిగా, పాలకుడిగానే కాకుండా.. భార్యను అమితంగా ప్రేమించి, గౌరవించే ఒక ఆదర్శ భర్తగా కూడా ఈ సన్నివేశం ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు.

భార్యాభర్తల బంధంలో బాహ్య విలాసాల కంటే పరస్పర ప్రేమ, గౌరవం, ఒకరికొకరు తోడుగా ఉండటమే ముఖ్యమనే సందేశాన్ని ఇది తెలియజేస్తుంది. కష్టతరమైన వనవాస కాలంలోనూ వారిద్దరి నడుమ వెల్లివిరిసిన ఈ సుమధుర దాంపత్య దృశ్యం భక్తజనులకు, నేటి తరానికి ఆదర్శప్రాయమైన జీవన పాఠంగా మిగులుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story