విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

  • ఫలితాలు రాబట్టే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదే!
  • దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మౌలిక సదుపాయాలు
  • అమరావతిలో ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు

రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతిఏటా డిఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీచేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దు. ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలుచేశాం, సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలే. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉంది. అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమలులో జాతీయస్థాయిలో రాష్ట్రం 14వస్థానంలో ఉంది, ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డకి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించడమే లక్ష్యంగా పనిచేద్దాం అని మంత్రి అన్నారు.

తల్లికి వందనం చివరి దశ నిధుల విడుదల

తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం, చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ. 325కోట్లు విడుదల చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని సిద్ధంచేయండి. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ & స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలి. ఇందుకోసం శాప్ సహకారం తీసుకోండి. రాజ్యాంగ దినోత్సవం నాడు అసెంబ్లీ లో విద్యార్థులచే ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి స్పీకర్ గారి అనుమతితో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విద్యార్థులను ఎంపిక చెయ్యాలని ఆదేశించారు.

మౌలిక సదుపాయాలకు దాతల సహకారం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశ, విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలి. ఆసక్తిగల తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలికసదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్ సైట్ రూపొందించాలి. జాతీయస్థాయిలో పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలి. రాష్ట్రంలోని అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప చిత్తూరులలో ఆధునీకరించిన సైన్స్ సెంటర్లను త్వరగా ప్రారంభించి, విద్యార్థులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దండి. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 125 ఆటిజం సెంటర్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, ఏడాదిలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి.

దేశంలోనే అత్యుత్తమంగా సెంట్రల్ లైబ్రరీ

దేశంలోనే అత్యుత్తమ మోడల్ తో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టాలి. 2లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేస్తున్న ఈ లైబ్రరీ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోండి. విశాఖపట్నం జగదాంబ సెంట్రల్ లో ప్రతిపాదించిన రీజనల్ లైబ్రరీని 50వేల అడుగుల్లో నిర్మించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ చర్చించారు. పబ్లిక్ లైబ్రరీల్లో నిర్ణీత సమయాలను ఖచ్చితంగా అమలుచేసేలా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలుచేయండి. ఉమ్మడిజిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం 13మాత్రమే జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా గ్రంధాలయాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ గ్రంథాలయాలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ కామన్ సాఫ్ట్ వేర్, వెబ్ సైట్ రూపొందించాలి. అందులో పెండింగ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్, బుక్ యాక్సెస్, లైబ్రరీ మేనేజ్ మెంట్ వివరాలను అందుబాటులో ఉంచాలని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story