నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం

ఈ సంవత్సరం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో జరపడానికి పర్మీషన్ కోరుతూ ఎన్బీఈ ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్బీఈఎంఎస్ అభ్యర్థనను తిరస్కరించింది. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించడానికి నిరాకరించింది. దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. అందుకే ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పరీక్ష ఒకే షిఫ్టులో జరపడానికి మరింత సమయం కావాలని బోర్డు కోరింది. ఈ క్రమంలో ఈ నెల 15న జరగవలసిన నీట్-పీజీ, 2025ను వాయిదా వేస్తున్నట్లు ఎన్బీఈఎంఎస్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.మే 30న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు తమ టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సాధ్యమైనంత త్వరగా పరీక్షను నిర్వహించడానికి అనువైన తేదీగా ఆగస్టు 3ని నిర్ణయించిందని, ఈ తేదీన పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్బీఈ సుప్రీంకోర్టును కోరింది. రెండు షిఫ్టుల్లో కాకుండా ఒకేషిఫ్టులో పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా జూన్ 15న నిర్వహించాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్బీఈ తెలిపింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 3వ తేదీన పరీక్ష జరపడానికి అవకాశం కల్పించింది. నీట్ పీజీ-2025 పరీక్ష ద్వారా ఎంఎస్ కోర్సులో 12,690, ఎండీ కోర్సులోని 24,360, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్లను భర్తీ చేయనున్నారు.
