మే 29వ తేదీన ఫస్ట్ ఫేజ్ దోస్త్ సీట్ల కేటాయింపు జరుగుతుంది

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. వెబ్ ఆప్షన్ల గడువు కూడా పూర్తి కానుంది. మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో... రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా.... సీట్లను
కేటాయిస్తారు. దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
దోస్త్ ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి 87వేలకు పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 50 వేలకుపైగా మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. మిగిలిన విద్యార్థులు https://dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి
చేసుకోవాల్సి ఉంటుంది. మే 29వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. దోస్త్ 2025 ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ గడువు జూన్ 6వ తేదీతో ముగుస్తుంది. సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే... వారి సీటు రద్దు అవుతుంది. మొదటి సెమిస్టర్ తరగతులు జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభవుతాయి. దోస్త్ ఫస్ట్ ఫేజ్ లో సీటు పొందే విద్యార్థులు
https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు. ఈ కాపీతో పాటు విద్యార్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. తెలంగాణ దోస్త్ 2025 రెండో విడత కింద మే 30 నుంచి జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక మూడో విడత ప్రక్రియ జూన్ 13 నుంచి షురూ అవుతుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.
