ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు యథాతధం

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు సంవత్సరాలకు గానీ ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే మెజార్టీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ణయించగా, కొన్నింటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈసారి కనీస రుసుము రూ.50 వేలు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. మరోపక్క గ్రేడ్ ఏ కళాశాలల ఫీజు అత్యధికంగా 2 లక్షలు దాటనున్నట్లు సమాచారం. ఈనెలాఖరులో ఇంజినీరింగ్ ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025–26, 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు గానూ ఫీజులను నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇప్పటికే పలు మార్లు సమావేశమైంది. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్ఆర్సీకి 157 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, ఆయా కాలేజీల పత్రాలను ఇప్పటికే స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కసరత్తు పూర్తవడంతో ఫీజుల ఖరారు ఓ కొలిక్కి వచ్చింది. సర్కారు కాలేజీలలో ప్రస్తుతం మినిమమ్ ఫీజు రూ.35వేలు ఉండగా, దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రైవేటు కాలేజీల్లో మినిమమ్ ఫీజు రూ.45వేలు ఉండగా, దాన్ని రూ.50 వేలకు పెంచాలని టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు రెడీ చేసింది.
దాదాపూ ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం లభించే అవకాశం ఉంది. అత్యధికంగా 4 ప్రైవేట్ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ. 2 లక్షలకు పైగా ఫీజులు ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్లతో జరిగిన సమావేశంలోనూ ఆయా యాజమాన్యాలకు తెలిపి, ఒప్పుకున్నట్టు టీఏఎఫ్ఆర్సీ అధికారులు వారితో సంతకాలూ చేయించుకున్నారు. ఇక ఈ ఫీజుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. గత బ్లాక్ పీరియడ్లో 38 కాలేజీల్లో లక్షకుపైగా ఫీజు డిసైడ్ చేశారు. ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. గతంలో రూ.80వేలకు పైగా ఫీజులున్న చాలా కాలేజీల్లో రూ.లక్షకు పైగా ఫీజులు ఉండే చాన్స్ ఉంది.
ఫీజుల విషయంలో పలు కాలేజీల యామాన్యాలు సర్కారు పెద్దలను కలిసి.. ఫీజులు పెంచాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. 25 కాలేజీలు మినహా.. మిగిలిన కాలేజీలు భారీగా ఫీజులు పెంచాలని టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చాయి. వీటిపై టీఏఎఫ్ఆర్సీ 3 సార్లు సమావేశమై చర్చలు చేసింది. సుమారు 40 కాలేజీల్లో ఫీజులపై కమిటీలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయా కాలేజీలపై మరోసారి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ కాలేజీలు ఇచ్చిన వివరాలపై మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ నెలాఖరులోపు ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేయాలని సర్కారు భావిస్తోంది. టీఏఎఫ్ఆర్సీ ఇచ్చిన ఫీజుల వివరాలతో ప్రభుత్వం అధికారికంగా జీవో రిలీజ్ చేస్తుంది.
