Painkillers Damaging Your Kidneys: నొప్పి తగ్గించే మాత్రలే కిడ్నీలను మింగేస్తున్నాయా? ఈ నిజం తెలుసుకోవాల్సిందే..
ఈ నిజం తెలుసుకోవాల్సిందే..

Painkillers Damaging Your Kidneys: చిన్నపాటి తలనొప్పి వచ్చినా, కాస్త నడుము నొప్పి వేధించినా మెడికల్ షాపునకు వెళ్లి సొంతంగా ఓ పెయిన్ కిల్లర్ వేసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. తక్షణ ఉపశమనం లభిస్తుండటంతో వీటిని సురక్షితమైనవిగా భావిస్తూ రోజువారీగా వాడుతున్నారు. కానీ, ఇలా వైద్యుడి సలహా లేకుండా తరచూ నొప్పి నివారణ మందులు మింగే అలవాటు నిశ్శబ్దంగా మీ మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని నెఫ్రాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. చివరకు ఇది కిడ్నీ ఫెయిల్యూర్ లేదా డయాలసిస్ అవసరమయ్యే ప్రమాదకర స్థితికి దారితీస్తోంది.
30, 40 ఏళ్ల వయసులోనే కిడ్నీ డ్యామేజ్
గతంలో వృద్ధాప్యంలో కనిపించే మూత్రపిండాల సమస్యలు, ఇప్పుడు పెయిన్ కిల్లర్ల అతి వినియోగం కారణంగా 30 నుంచి 40 ఏళ్ల యువతలో కూడా అధికంగా వెలుగుచూస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకాలి నొప్పులు, మైగ్రేన్ లేదా కీళ్ల నొప్పులను భరించలేక డాక్టర్ను సంప్రదించకుండానే నెలల తరబడి మాత్రలు వాడుతూ ఆసుపత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య వారానికీ పెరుగుతోంది.
కిడ్నీలపై ఈ మందులు ఎలా దాడి చేస్తాయి?
రక్త ప్రసరణ తగ్గడం: మన శరీరంలో కిడ్నీలకు సరైన రక్త ప్రసరణ జరగడానికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు ఎంతో కీలకం. పెయిన్ కిల్లర్స్ ఈ రసాయనాల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఫలితంగా కిడ్నీల్లోని రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్త ప్రవాహం గణనీయంగా పడిపోతుంది.
ఫిల్ట్రేషన్ దెబ్బతినడం: రక్త ప్రవాహం తగ్గడంతో కిడ్నీల్లోని వ్యర్థాలను వడపోసే కీలక భాగాలు దెబ్బతింటాయి. దీనివల్ల కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ప్రమాదం ముదిరేదాకా లక్షణాలు బయటపడవు
పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రక్రియ మొదట్లో ఏ విధమైన నొప్పి లేదా లక్షణాలను చూపించదు. సమస్య తీవ్రమై మూత్రపిండాల పనితీరు గణనీయంగా తగ్గినప్పుడే శరీరంలో మార్పులు కనిపిస్తాయి.
మూత్ర విసర్జనలో ఇబ్బంది లేదా పరిమాణం తగ్గడం.
పాదాలు, చీలమండలాల్లో వాపు రావడం.
కారణం లేకుండా విపరీతమైన నీరసం, వెన్నునొప్పి రావడం.
ఈ స్థాయికి చేరినప్పుడు నష్టాన్ని పూడ్చడం కష్టమై, డయాలసిస్ మాత్రమే మార్గంగా మారుతోంది.
నిపుణులు ఇచ్చే సలహా ఏంటి?
నెలకు ఒకటి లేదా రెండు సార్లు స్వల్ప నొప్పికి వైద్యుల సూచన మేరకు మాత్రలు వేసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ నొప్పి పదేపదే వేధిస్తున్నప్పుడు సొంత వైద్యం చేసుకోకూడదు. నొప్పి అనేది ఏదో ఒక అంతర్గత సమస్యకు శరీరమిచ్చే సంకేతం మాత్రమే. కాబట్టి నొప్పికి గల మూలకారణాన్ని గుర్తించి వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందాలి తప్ప, ఇష్టానుసారంగా పెయిన్ కిల్లర్లు వాడి కిడ్నీలను ప్రమాదంలోకి నెట్టొద్దు.

