Train Ticket Prices : కొన్నేళ్ల తర్వాత భారీగా పెరగనున్న రైల్వే టికెట్ల ధరలు.. జులై 1 నుంచి కొత్త రేట్లు
జులై 1 నుంచి కొత్త రేట్లు

Train Ticket Prices : భారతీయ రైల్వేస్ నాలుగైదేళ్ల తర్వాత మొదటిసారిగా ప్రయాణ ఛార్జీలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ ధరల పెంపు చాలా స్వల్పంగా ఉండబోతుంది. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. నాన్-ఏసీ రైళ్లలో ప్రతి కిలోమీటర్కు ఒక పైసా చొప్పున ధర పెరుగుతుందని, అలాగే ఏసీ టికెట్లకు ప్రతి కిలోమీటర్కు రెండు పైసల చొప్పున ధర పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొంది. ఈ ధరల పెంపు జులై 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కోవిడ్ సమయంలో టికెట్ ధరలు పెంచిన తర్వాత, మళ్లీ ఇప్పుడు ప్రయాణీకుల టికెట్ ధరలను పెంచుతున్నారు.
సబర్బన్ రైళ్లలో, అలాగే సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లలో 500 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి ధరల పెంపు ఉండదు. అంటే, షార్ట్ డిస్టెన్స్ ప్రయాణికులకు పెద్దగా భారం ఉండదు. అయితే, 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సెకండ్ క్లాస్ ప్రయాణికులకు ప్రతి కిలోమీటర్కు అర పైసా చొప్పున ధర పెరుగుతుంది.
సవరించిన రైలు ప్రయాణ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి?
సబర్బన్ రైళ్లు: టికెట్ ధరల్లో ఎలాంటి పెంపు ఉండదు.
మంత్లీ సీజన్ టికెట్ ధరలు: వీటిలో కూడా ఎలాంటి మార్పు ఉండదు.
సెకండ్ క్లాస్ ప్రయాణం (500 కి.మీ. లోపు): టికెట్ ధరలు పెరగవు.
సెకండ్ క్లాస్ ప్రయాణం (500 కి.మీ. పైగా): ప్రతి కిలోమీటర్కు అర పైసా చొప్పున ధర పెరుగుతుంది.
ఏసీ కాని మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లు: ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున ధర పెరుగుతుంది.
ఏసీ రైళ్లు: ప్రతి కిలోమీటర్కు 2 పైసల చొప్పున టికెట్ ధర పెరుగుతుంది.
తత్కాల్ బుకింగ్కు ఆధార్ తప్పనిసరి
తత్కాల్ టికెట్ బుకింగ్ చేయాలంటే ఇకపై ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. జూన్ 10న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధన కూడా జులై 1 నుంచి అమలులోకి రానుంది. అంతేకాకుండా, భారతీయ రైల్వేస్కు చెందిన అధికారిక బుకింగ్ ఏజెంట్లకు కూడా తత్కాల్ బుకింగ్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టారు. తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యే మొదటి అరగంటలో వీళ్లు టికెట్లు బుక్ చేయలేరు.
ఏసీ క్లాస్ తత్కాల్ బుకింగ్లకు ఉదయం 10 గంటల నుంచి 10:30 గంటల వరకు ఏజెంట్లకు నిబంధన ఉంటుంది. నాన్-ఏసీ తత్కాల్ బుకింగ్లకు ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు ఏజెంట్లకు నిబంధన ఉంటుంది. ఈ సమయంలో ఏజెంట్లకు తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ నిర్ణయం సాధారణ ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు దొరికే అవకాశాలను పెంచుతుందని రైల్వే భావిస్తోంది.
రైల్వేకు ఎంత ఖర్చవుతుంది?
మార్చి 2025లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారతీయ రైల్వేస్ ఒక ప్రయాణికుడికి ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి సగటున రూ.1.38 ఖర్చు చేస్తోంది. అయితే, ప్రయాణికుల నుంచి టికెట్ ద్వారా కేవలం 73 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది. మిగిలిన డబ్బును ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా భర్తీ చేస్తుంది. అందుకే, ఈ స్వల్ప ధరల పెంపు రైల్వే ఆదాయానికి కొంతవరకు సహాయపడుతుందని భావిస్తున్నారు.
