ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Jackfruit: పండ్ల రారాజు మామిడి అయితే... రుచిలో, పోషకాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పండు 'పనస'. పైన గరుకుగా, ముళ్ళు ఉన్నట్లు అనిపించినా... లోపల ఉండే పచ్చటి తొనల తీపిదనం అద్భుతం. మరి ఈ పనస పండు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం!
పనస పండులో ఫైబర్ అంటే పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇందులో విటమిన్- సి మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇది కాపాడుతుంది.
పనస పండులో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటును అంటే బిపిని అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా పనస పాత్ర కీలకమైనది.
చాలామంది స్వీట్ అని పనస పండు తినడానికి భయపడతారు. కానీ, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల పరిమితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఇక ఇందులో ఉండే విటమిన్- ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతాయి.

