Avoid These Foods During the Monsoon: వర్షాకాలం రాగానే ఎండల వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఈ సీజన్ ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులను కూడా వెంటబెట్టుకొస్తుంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా విస్తరిస్తాయి. దీనికి తోడు ఈ సమయంలో మన శరీరంలో జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది. అందువల్ల మనం తినే ఆహారం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గ్యాస్, అజీర్తి, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఆరోగ్య నిపుణులు ఏం సూచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

వీధి ఆహారాలు, చాట్స్ వద్దు

వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా పానీపూరి, సమోసా, బజ్జీలు వంటి స్ట్రీట్ ఫుడ్స్ తినాలనిపించడం సహజం. కానీ, వర్షాకాలంలో రోడ్ల పక్కన దొరికే ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీధి పక్కన తెరిచి ఉంచే ఆహారాలపై ఈ సీజన్‌లో ఈగలు, దోమలు, బ్యాక్టీరియా త్వరగా చేరుతాయి. అలాగే అక్కడ వాడే నీరు కలుషితమై ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది నేరుగా కలరా, టైఫాయిడ్, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.

ఆకుకూరలు తినేటప్పుడు జాగ్రత్త!

సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతారు. కానీ వర్షాకాలంలో మాత్రం ఆకుకూరలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో ఆకులపై తేమ కారణంగా సూక్ష్మక్రిములు, కంటికి కనిపించని పురుగులు, బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంది.

చిట్కా: ఒకవేళ ఆకుకూరలు వండుకోవాలనుకుంటే, వాటిని వండడానికి ముందు వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి.

ఫ్రైడ్ - ఆయిలీ ఫుడ్స్

సమోసాలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి నూనెలో బాగా వేయించిన పదార్థాలను వర్షాకాలంలో పరిమితం చేయాలి. ముందే చెప్పుకున్నట్లు ఈ సీజన్‌లో జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ కొవ్వు, నూనె ఉన్న పదార్థాలను తింటే కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.

సముద్ర ఆహారం

వర్షాకాలంలో సముద్ర ఆహారాలైన చేపలు, రొయ్యలు వంటి వాటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సీజన్ జలచరాల ప్రజనన సమయం. ఈ సమయంలో లభించే సీఫుడ్‌ను తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఒకవేళ తినాలనుకుంటే అవి పూర్తిగా తాజావని నిర్ధారించుకుని, బాగా ఉడికించిన తర్వాతే తినాలి.

కట్ చేసి ఉంచిన పండ్లు

చాలా మంది మార్కెట్లో లేదా రోడ్డు పక్కన ముందుగానే కట్ చేసి విక్రయించే పండ్ ముక్కలను (ముఖ్యంగా పుచ్చకాయ, బొప్పాయి, జామ వంటివి) కొని తింటారు. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో ఇలా కట్ చేసిన పండ్లపై బ్యాక్టీరియా చాలా వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పండ్లను తినే ముందే స్వయంగా కట్ చేసుకుని, వెంటనే తినేయాలి.

వర్షాకాలంలో ఏం చేయాలి?

ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.

ఇంట్లో వండిన వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

రోగనిరోధక శక్తిని పెంచే అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story