Drinking Less Water During Monsoon: వర్షాకాలంలో నీళ్లు తక్కువ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదకర లక్షణాలు మీలో ఉన్నట్లే!
ఈ ప్రమాదకర లక్షణాలు మీలో ఉన్నట్లే!

Drinking Less Water During Monsoon: వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం వల్ల మనకు సాధారణంగా దాహం వేయదు. అయితే, "దాహం వేయడం లేదు కదా" అని చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తుంటారు. వర్షాలు పడుతున్నంత మాత్రాన మన శరీరానికి నీటి అవసరం తగ్గదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో కూడా డీహైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
ఎండాకాలంలో చెమట రూపంలో నీరు బయటకు పోవడం వల్ల దాహం ఎక్కువగా వేస్తుంది. కానీ వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం నుండి చెమట త్వరగా ఇంకిపోదు, లేదా చెమట పట్టదు. దీనివల్ల మనకు దాహం వేసినట్లు అనిపించదు. ఈ పరిస్థితినే ఆరోగ్య నిపుణులు 'సైలెంట్ డీహైడ్రేషన్' అంటారు. అంటే దాహం వేయకపోయినా శరీరం లోపల నీటి శాతం వేగంగా తగ్గిపోతుంటుంది.
శరీరంలో నీటి శాతం తగ్గితే కేవలం అలసట మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. తరచూ తలనొప్పి రావడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం, శ్రద్ధ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు, శరీరంలో నీరు తగ్గితే మూత్రపిండాల (కిడ్నీల) పనితీరు మందగించడమే కాకుండా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే వర్షాకాలంలో దాహం వేసే వరకు ఆగకుండా క్రమం తప్పకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. చల్లటి నీళ్లకు బదులుగా కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీటిని తాగాలి. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, తాజా సూప్లు, పండ్ల రసాలు మరియు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

