Eating Too Much Salt: రుచి కోసం మనం ఆహారంలో వాడే ఉప్పు, మోతాదు మించితే ప్రాణసంకటంగా మారుతుందని మనకు తెలుసు. సాధారణంగా ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుందని భయపడుతుంటాం. కానీ ఉప్పు మన శరీరంలోని కాల్షియం నిల్వలను కూడా కరిగించేస్తుందని మీకు తెలుసా..? అవును, తాజా అధ్యయనాల ప్రకారం అధిక ఉప్పు వాడకం ఎముకల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉప్పు - కాల్షియం: అసలు సంబంధం ఏమిటి?

బలమైన ఎముకలకు, దంతాలకు, నరాల పనితీరుకు కాల్షియం అత్యంత అవసరం. అయితే మనం ఉప్పును అధికంగా తీసుకున్నప్పుడు, మన శరీరం ఆ అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఈ ప్రక్రియలో సోడియంతో పాటు ఎముకల్లో ఉండాల్సిన కాల్షియం కూడా మూత్రం ద్వారా బయటకు వస్తుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోయి, ఎముకలు గుల్లబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రమాదం ఎవరికి ఎక్కువ?

ఈ సమస్య అందరిలో ఉన్నప్పటికీ, ఈ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి..

వృద్ధులు: వయసు పెరిగే కొద్దీ సహజంగానే ఎముకల సాంద్రత తగ్గుతుంది, అధిక ఉప్పు దీనిని మరింత వేగవంతం చేస్తుంది.

మహిళలు: హార్మోన్ల మార్పుల వల్ల మహిళల్లో కాల్షియం లోపం తలెత్తే అవకాశం ఎక్కువ.

కాల్షియం లోపం ఉన్నవారు: ఇప్పటికే ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తింటే ఫ్రాక్చర్ల ముప్పు పెరుగుతుంది.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?

మీ ఎముకలు ఉక్కులా బలంగా ఉండాలంటే ఈ మార్పులు చేసుకోండి:

ఉప్పును తగ్గించండి: వంటల్లో ఉప్పును పరిమితంగా వాడండి. టేబుల్ సాల్ట్ అలవాటును మానుకోండి.

ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరం: చిప్స్, పచ్చళ్ళు, ఇన్స్టంట్ నూడుల్స్ మరియు ప్యాక్ చేసిన స్నాక్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. వీటిని వీలైనంత వరకు తగ్గించండి.

కాల్షియం పెంచండి: మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, చిరుధాన్యాలను చేర్చుకోండి.

చురుకైన జీవనశైలి: ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

రుచి కోసం ఉప్పును ఇష్టపడటంలో తప్పు లేదు, కానీ అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉండకూడదు. ఎముకల బలం కోసం ఉప్పును తగ్గించి, కాల్షియం ఉన్న ఆహారాన్ని పెంచుకోవడం నేటి అవసరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story