Just 15 Minutes of Walking : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళన అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ప్రశాంతత కోసం చాలా మంది వీకెండ్స్‌లో నగరాలకు దూరంగా పర్వతాలకో, హిల్ స్టేషన్లకో ప్రయాణాలు ప్లాన్ చేస్తుంటారు. అయితే, మనశ్శాంతి కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క నేచురల్ క్యాపిటల్ అలయన్స్ నిర్వహించిన తాజా మెటా-విశ్లేషణ వెల్లడించింది. మన నగరంలోని ఒక చిన్న పార్కులో లేదా చెట్లు ఉన్న వీధిలో కేవలం 15 నిమిషాలు నడిచినా ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

6,000 మందిపై పరిశోధన.. తేలిన ఆసక్తికర విషయాలు..

దాదాపు 6,000 మందిపై జరిపిన ఈ విస్తృత అధ్యయనంలో పరిశోధకులు కొన్ని కీలక విషయాలను కనుగొన్నారు. కాంక్రీట్ జంగిల్‌లో కాకుండా.. కాసేపు సహజమైన వాతావరణంలో గడపడం వల్ల మానసిక స్థితిలో అద్భుతమైన మార్పులు వస్తాయని తేలింది.

ప్రతికూల భావాలకు చెక్:

కొద్దిసేపు ప్రకృతి మధ్య నడవడం వల్ల ఆందోళన, నిరాశ, కోపం, శారీరక అలసట వంటి నెగెటివ్ ఫీలింగ్స్ పూర్తిగా తగ్గిపోతాయి.

శ్రేయస్సు పెంపు: ప్రకృతి మనస్సును ప్రశాంత పరిచి, అంతర్గత శ్రేయస్సును పెంచుతుంది.

సమయం కంటే అవగాహనే ముఖ్యం: ఫోన్‌ పక్కన పెట్టేయండి..

మనం ప్రకృతితో ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నామనే దానికంటే.. ఆ గడిపే సమయంలో మన శ్రద్ధ ఎక్కడ ఉందనేదే ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్టు నీడలో కూర్చుని కూడా మొబైల్ స్క్రీన్‌ను చూస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

దీని కోసం ప్రముఖ పరిశోధకుడు రిచర్డ్‌సన్ ప్రకృతిలోని మూడు మంచి విషయాలు అనే ఒక సులభమైన వ్యాయామాన్ని సిఫార్సు చేస్తున్నారు. ప్రతిరోజూ మీరు ప్రకృతిలో గమనించిన ఏవైనా మూడు మంచి విషయాలను (ఉదాహరణకు: పక్షుల కిలకిలరావాలు వినడం, చెట్ల మధ్య నుండి వచ్చే చల్లని గాలిని అనుభూతి చెందడం, లేదా పువ్వుల సువాసనను ఆస్వాదించడం) ఒక డైరీలో రాసుకోవాలి. వారానికి ఒక్కసారి ఇలా చేసినా కూడా.. వచ్చే నెల రోజుల పాటు మీ మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.

ప్రకృతితో మమేకమవ్వడానికి 5 మార్గాలు :

మానవ మెదడు సహజంగానే ప్రకృతిని ఆస్వాదించేలా రూపొందించబడింది. మన అపార్ట్‌మెంట్ కిటికీ నుండి కనిపించే ఒక్క చిన్న చెట్టును చూసి కూడా మనం రిలాక్స్ అవ్వచ్చు. ప్రకృతితో మరింత లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇక్కడ 5 శాస్త్రీయ మార్గాలు ఉన్నాయి.

పంచేంద్రియాలను ఉపయోగించండి:

ప్రకృతిని కేవలం కళ్లతో చూడటమే కాదు.. మీ ఐదు ఇంద్రియాలతో (చూడటం, వినడం, తాకడం, వాసన చూడటం, అనుభూతి చెందడం) గ్రహించండి.

శాంతిని ఆస్వాదించండి:

ప్రకృతి యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపడటం అలవాటు చేసుకోండి. అది మనస్సులో తెలియని ప్రశాంతతను నింపుతుంది.

సౌందర్యాన్ని బంధించండి:

సూర్యాస్తమయం లేదా సూర్యోదయం వంటి ప్రకృతి అందాలను ఫోటోగ్రఫీ ద్వారా లేదా మానసిక ధ్యానం ద్వారా ఆస్వాదించండి.

వ్యక్తీకరించండి:

ప్రకృతి మీలో కలిగించే మార్పులను, భావాలను డైరీలో రాయడం లేదా కవిత్వం రూపంలో వ్యెక్తీకరించడం చేయండి.

ప్రకృతికి మేలు చేయండి:

పక్షులకు దాహార్తిని తీర్చడానికి నీరు పెట్టడం, ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం వంటి పనులు చేయండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story