Sitting for Long Hours at Work: ఆధునిక కాలంలో సాంకేతికత పెరిగిన తర్వాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుని పనిచేయడం అనేది నేటి జీవనశైలిలో ఒక భాగమైపోయింది. అయితే,వ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. ఇలా ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడాన్ని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తున్నారు. నిరంతరం ఒకే చోట కూర్చోవడం అనేది ధూమపానం అంత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి అంతర్గత సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు శాస్త్రీయంగా తెలుసుకుందాం.

ఒకే చోట కూర్చోవడం వల్ల వచ్చే 5 ప్రధాన సమస్యలు..

వెన్నునొప్పి, కీళ్ల సమస్యలు

మనం ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు మన వెన్నెముక, మెడ మరియు నడుము కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా స్పాండిలైటిస్, నడుము నొప్పి సియాటికా వంటి తీవ్రమైన నొప్పులకు దారితీస్తుంది. అంతేకాకుండా మోకాళ్ల కీళ్ల మధ్య ఉండే లూబ్రికేషన్ తగ్గిపోయి, చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

మందగించే జీవక్రియ - ఊబకాయం

కదలకుండా ఒకే చోట కూర్చున్నప్పుడు మన శరీరంలోని జీవక్రియ రేటు గణనీయంగా పడిపోతుంది. మనం తిన్న ఆహారం శక్తిగా మారకుండా, కొవ్వు రూపంలో పొత్తికడుపు , తొడల భాగంలో పేరుకుపోతుంది. ఇది చాలా వేగంగా బరువు పెరగడానికి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు హెచ్చడానికి కారణమవుతుంది.

డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు

వైద్య పరిశోధనల ప్రకారం.. రోజంతా కదలకుండా కూర్చునే వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి టైప్-2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం 70శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణ సజావుగా సాగకపోవడం వల్ల గుండె జబ్బులు మరియు పక్షవాతం. వచ్చే ముప్పు పెరుగుతుంది.

రక్తనాళాల సమస్యలు

గంటల తరబడి కాళ్లు కిందకు వేసి కూర్చోవడం వల్ల కాళ్లలోని రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కాళ్లలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీనిని వైద్య పరిభాషలో డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. ఇది ఒక్కోసారి ఊపిరితిత్తులకు సరఫరా అయ్యే రక్తనాళాలను బ్లాక్ చేసి ప్రాణాంతకంగా మారుతుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన

శారీరక కదలికలు లేకపోవడం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా నష్టం కలిగిస్తుంది. ఒకే చోట నిర్బంధంగా కూర్చోవడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు. ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మానసిక అలసట, డిప్రెషన్, తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుంది.

ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి సులభమైన మార్గాలు..

20-20-20 రూల్ లేదా 45 నిమిషాల బ్రేక్:

ఆఫీసులో పనిచేసేటప్పుడు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి మీ సీటు నుండి లేచి కనీసం 2 నుండి 3 నిమిషాల పాటు అటు ఇటు నడవండి లేదా చిన్నగా బాడీ స్ట్రెచింగ్ చేయండి.

కూర్చునే భంగిమ:

కూర్చునేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే కుర్చీ వెనుక భాగంలో చిన్న కుషన్ ఉపయోగించండి. కంప్యూటర్ స్క్రీన్ మీ కంటి చూపునకు సమాంతరంగా ఉండాలి.

ఫోన్ కాల్స్ మాట్లాడుతూ నడవడం:

ఆఫీసులో లేదా ఇంట్లో ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేటప్పుడు ఒకే చోట కూర్చోకుండా.. నడుస్తూ మాట్లాడే అలవాటు చేసుకోండి.

హైడ్రేటెడ్‌గా ఉండండి:

రోజంతా తగినన్ని నీళ్లు తాగుతుండాలి. దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా, వాష్‌రూమ్ కోసమైనా మీరు తరచూ సీటు నుండి లేవాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా మంచిదే.

PolitEnt Media

PolitEnt Media

Next Story