Bonalu celebrations in Hyderabad begin in Golconda

హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా లంగర్ హౌజ్ చౌరస్తాలో శ్రీశ్రీశ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున స్పీకర్, మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్,హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ,సిపి సివి ఆనంద్ ,కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సాంప్రదాయాలు ఆచారాలు ప్రపంచస్థాయిలో గుర్తించదగిన ఆషాఢ మాస బోనాలని అన్నారు.
మంత్రి పొన్నం ప్రసంగంలో ముఖ్యాంశాలు
ఈరోజు తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు,అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మొత్తం ప్రభుత్వం తరుపున ముఖ్యమైన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. హైదరాబాద్ ప్రజలు వచ్చే భక్తులకు మంచి ఆతిధ్యం ఇచ్చేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. బోనాల పండగ సందర్భంగా 3 వేల దేవాలయాలకు పండగ కోసం 20 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం కేటాయించింది.
నెల రోజుల పాటు వివిధ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తూ రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఆ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం సంవృద్ధి వర్షాలతో పాడి పంటలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
