ఐఏఎస్ అధికారి సీఎం కాళ్లు మొక్కడంపై సీఎస్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటలో పర్యటించారు. అక్కడ ఓ సభలో ప్రసంగించారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ.శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అచ్చంపేటలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, ఇక్కడ ఐఏఎస్ కాళ్లు మొక్కిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గమనించనట్టు తెలుస్తోంది. కానీ, సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సదరు ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహారం వివాదాస్పదం అయింది. దీంతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికారులందరికీ కీలక సూచనలు చేస్తూ సర్క్యులర్ పంపించారు. ప్రభుత్వ సమావేశాల్లో కానీ.. ప్రజా సమావేశాల్లో కానీ అధికారులు ఎవరూ అనుచితంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1968 ఏఐఎస్ రూల్స్కు అనుగుమంగా మసలుకోవాలన్నారు. అధికారుల ప్రవర్తన ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఉండాలి కానీ.. తగ్గేలా.. నవ్వుల పాలయ్యేలా ఉండకూడదన్నారు. ఏఐఎస్ అధికారులు రాజకీయ నాయకులతో ఉన్నపుడు బాధ్యతగా వ్యవరించాలంటూ తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని.. ప్రజా సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అనుచిత ప్రవర్తన మానుకోవాలని అన్నారు. అధికారి ఎల్లప్పుడు పరిపూర్ణ నిజాయితీతో ఉండాలని సూచించారు. ఇకపై ఇలాంటి చర్యలు జరిగే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఐఏఎస్ అధికారుల అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని.. ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలని సీఎస్ చాలా గట్టిగా చెప్పారు.
