‘H-City’ is a game changer in Hyderabad’s development

హైదరాబాద్ నగరాభివృద్ధిలో "హెచ్ - సిటీ" ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఇది దిక్సూచిగా మారుతుందన్నారు. "హెచ్- సిటీ" ప్రాజెక్ట్ లో భాగంగా రూ.45 కోట్లతో ఎన్ హెచ్ 65 నుంచి అమీన్ పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు ఆయన చందానగర్ లో శంకుస్థాపన చేశారు. "హైదరాబాద్‌ నగరాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బడ్జెట్‌లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రూ.7032 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే హెచ్-సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం" అని మంత్రి వివరించారు. "ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రహదారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం, పర్యావరణహితంగా నగరాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు. రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో నగరంపై పడుతున్న ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. నగరవాసులకు సౌకర్యమంతమైన నాణ్యమైన జీవన శైలి అందుతుంది" అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

"ఇప్పటికే నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో వేయి ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాం. వాటికి అదనంగా మరో 800 బస్సులను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందుకు కేంద్రం సైతం సహకరించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కీలక ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నాం" అని ఆయన చెప్పారు. "హైదరాబాద్ అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా నలువైపులకు విస్తరిస్తాం. మాపై కొందరూ పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. మంచి చేయాలని సంకల్పిస్తే హెచ్ సీయూ భూములు విషయంలో వారేం చేశారో మీరంతా గమనించారు. మా లక్ష్యం... ధ్యేయం ఒక్కటే అభివృద్ధి. మీకోసం పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి... సహకరించండి" అని మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story