అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 275 మంది మృతి
మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం..

జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 275గా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171, బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్, టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల లోనే మేఘనీ నగర్ లోని బీ.జే. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలి పోయింది. ఈ ప్రమాదంలో 275 మంది మరణించినట్టుగా ప్రభుత్వం అధికారకంగా ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానం లోని సిబ్బందితో సహా 242 మందిలో ప్రయాణికులు ఉన్నారని, వారిలో 241 మంది విమానం కూలిన ఘటనలో మరణించగా మరో 34 మంది విమానం కూలిన భవంతిలో ఉన్న విద్యార్థులు, స్థానికులు అని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 11(ఎ) సీట్ లో కూర్చున్న భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డారు.
మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితో సహ 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటి వరకు 256 మృత దేహాలను గుర్తించి, బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం, గాయపడిన వారి వైద్య ఖర్చులను భరిస్తామని ప్రకటించింది.
