Australian PM : భారత్కు వ్యతిరేకంగా సెనెటర్ వ్యాఖ్యలు: క్షమాపణలు కోరిన ఆస్ట్రేలియా ప్రధాని
క్షమాపణలు కోరిన ఆస్ట్రేలియా ప్రధాని

Australian PM : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ జసింటా నంపిజిన్పా ప్రైస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సూచించారు. ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్-ఇండియన్ కమ్యూనిటీలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
సెంటర్-రైట్ లిబరల్ పార్టీకి చెందిన సెనెటర్ జసింటా నంపిజిన్పా ప్రైస్, ఆస్ట్రేలియాలో పెరుగుతున్న జీవన వ్యయాలకు భారత వలసదారులను నిందిస్తూ విమర్శలు చేశారు. అంతేకాక, ఆల్బనీస్కు చెందిన లేబర్ పార్టీ ఓట్ల కోసం భారతీయ వలసదారులను రప్పిస్తోందని ఆరోపించారు. "ఆస్ట్రేలియాకు వచ్చిన భారతీయ వలసదారుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ సంఖ్య లేబర్ పార్టీకి వచ్చిన ఓట్లలో స్పష్టంగా కనిపిస్తుంది" అని ప్రైస్ ఒక రేడియో ఇంటర్వ్యూలో అన్నారు.
ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్-ఇండియన్ కమ్యూనిటీలో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె సొంత లిబరల్ పార్టీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఆల్బనీస్ స్పందిస్తూ, "సెనెటర్ చేసిన వ్యాఖ్యలు భారత కమ్యూనిటీని బాధించాయి. ఆ వ్యాఖ్యలు సత్యం కాదు. ఆమె తప్పక క్షమాపణలు చెప్పాలి. ఆమె సొంత పార్టీ సహచరులు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు" అని ఎబిసి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
2023 గణాంకాల ప్రకారం, ఆస్ట్రేలియాలో 8,45,800 మంది భారత సంతతి వ్యక్తులు నివసిస్తున్నారు, ఇది గత దశాబ్దంతో పోలిస్తే రెట్టింపు. అంతేకాక, ఆస్ట్రేలియాలో జన్మించిన వేలాది మంది భారత సంతతి వారసత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ నిరసనల నేపథ్యంలో న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం కమ్యూనిటీ గ్రూపులతో సమావేశమై, భారతీయ కమ్యూనిటీకి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చింది. "గత కొన్ని వారాలుగా చోటుచేసుకున్న జాత్యహంకార వ్యాఖ్యలు, విభజన ఆరోపణలకు మా రాష్ట్రంలో లేదా దేశంలో స్థానం లేదు" అని ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ క్రిస్ మిన్స్ అన్నారు.
భారత విదేశాంగ శాఖ ఈ పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
