హర్మూజ్ జలసంధి తెరవాలని షరతు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని తెరిచి సాధారణ సముద్ర రవాణాను అనుమతించాలని షరతు విధించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడాను. ఇరాన్‌కు ఇచ్చిన గడువును రెండు వారాలపాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని వారు కోరారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుతో రెండు వారాల గడువు ఇవ్వడానికి, కాల్పుల విరమణకు అంగీకరించాను’’ అని ట్రంప్ తెలిపారు.

ఈ కాల్పుల విరమణ ఇరు దేశాల వైపు నుంచి అమలు కావాలని స్పష్టం చేశారు. ఇరాన్ తమ పది సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయని చెప్పారు.

ఈ రెండు వారాల గడువు ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి, పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇది ముఖ్యమైన అడుగు అని అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌పై దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే హర్మూజ్ జలసంధి రవాణా సమస్యను పరిష్కరించడంలో కీలకం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story