మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న మిస్ అర్జెంటీనా గ్వాడలూప్ అలోమార్ భారత్‌లో తన అనుభవాలను పంచుకుంటూ పొలిటెంట్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


పోటీలో ఒత్తిడి గురించి గ్వాడలూప్ మాట్లాడుతూ, “ఈ ఒత్తిడి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ నేను ఆనందంగా గడపాలని చూస్తున్నాను. ఇతర దేశాల నుంచి వచ్చిన అమ్మాయిలతో స్నేహం చేసుకోవడం, వారి సంస్కృతిని తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఇది జీవితంలో ఒక్కసారి కలిగే అవకాశం. సరదాగా పాల్గొని, ఉత్తమ ప్రదర్శనను ఇవ్వడమే నా లక్ష్యం,” అని చెప్పారు.



భారతదేశం విడిచి వెళ్లే ముందు చేయాలనుకుంటున్న మూడు విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఆమె మొదటగా డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందని చెప్పారు. “నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. క్లాస్ తీసుకుంటే బాగుంటుంది,” అన్నారు. తర్వాత ఆలయాల్లో మరింత సమయం గడపాలని ఉందన్నారు. “ఇప్పటివరకు చూసిన ఆలయం ఎంతో అందంగా ఉంది. అక్కడ కొంత మానసిక ప్రశాంతతను అనుభవించాను. మరింత సమయం గడపాలని ఉంది,” అన్నారు. మూడవది, భారతీయ ప్రజలకు దగ్గర కావాలని ఉందన్నారు. “ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమగా ఉంటున్నారు. వారు నన్ను చూసి చిరునవ్వుతో చేతులు ఊపుతూ, ఫొటోలు తీయాలని కోరుతారు. కానీ భద్రత కారణాల వల్ల కొంత దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పాలని ఉంది,” అన్నారు గ్వాడలూప్‌.



భారతీయ సినిమాల గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఇండియన్ మూవీస్ చూడలేదని. కానీ తనకు రొమాంటిక్ కామెడీలు చాలా ఇష్టమన్నారు. హారర్ సినిమాలు మాత్రం తనకు నచ్చవని చెప్పారు.



ప్రేమ అర్థం ఏంటి అని అడిగితే, ఆమె చెప్పిన సమాధానం ఎంతో భావోద్వేగపూరితంగా ఉంది. “ప్రేమ అనేది శక్తినిచ్చే మూలధనం. మన బాహ్య అందం ఒక దశలో తీరిపోతుంది. కానీ మన హృదయం మంచిదైతే అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ప్రేమే మిగిలిపోతుంది,” అన్నారు.



తన అభిమానులకు చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే అన్న గ్వాడలూప్‌.. 'మీ కలల్ని వదలకండి. నేను చిన్నప్పటి నుంచే పెద్ద కలలు కంటూ వచ్చాను. ‘రియలిస్టిక్‌గా ఆలోచించు’ అని చాలామంది చెప్పారు. కానీ నమ్మకంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే. మీరు శక్తివంతులే, ప్రత్యేకులే. మీ లక్ష్యాలను మీరు చేరవచ్చు,” అంటూ ప్రేరణనిచ్చే సందేశాన్ని ఇచ్చారు.




Updated On 23 May 2025 2:10 PM IST
Politent News Web4

Politent News Web4

Next Story