Ebola Outbreak Intensifies in Congo: కాంగోలో ఎబోలా విజృంభం: 101 మంది మృతి, వ్యాప్తి ఆందోళన
101 మంది మృతి, వ్యాప్తి ఆందోళన

Ebola Outbreak Intensifies in Congo: మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ మరోసారి తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 101 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగో ఆరోగ్య అధికారులు ప్రకటించారు. ఈ పరిణామం ప్రాంతీయంగా తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.
అధికారుల ప్రకటన ప్రకారం, కాంగోలో ఇప్పటివరకు 550కి పైగా ఎబోలా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 101 మంది మృతపడగా, 19 మంది కోలుకున్నారు. మరో 309 మంది అనుమానితులు ఐసోలేషన్లో ఉన్నారు. ఆదివారం ఒక్కరోజులోనే ఇటురి, నార్త్ కివు ప్రాంతాల్లో 35 కొత్త కేసులు నమోదు కాగా, 10 మంది మరణించారు.
ప్రస్తుతం వైరస్ తీవ్రత పెరుగుతోందని, కొన్ని రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ, సరైన టీకా మరియు చికిత్స లేకపోవడం ప్రధాన సవాళ్లుగా మారాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయంగా వ్యాధి మరింత వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొంది. అంతేకాకుండా, పొరుగు దేశం ఉగాండాలో 19 ఎబోలా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఇప్పటికే రెండు మరణాలు సంభవించాయి.

