గాజాలో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కార ప్రయత్నాలకు మరోసారి నిరాశ ఎదురైంది. కాల్పుల విరమణకు సంబంధించిన అమెరికా ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. గతంలో తమతో జరిగిన చర్చలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఆఫర్ చేసిన డీల్ ఉందని హమాస్ నేతలు బీబీసీతో చెప్పారు. దాంతో గాజాలో శాంతి సాధన దిశగా సాగుతున్న ప్రయత్నాలకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.



అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న కాల్పుల విరమణ ప్రతిపాదన ప్రకారం, హమాస్ చెరలో ఉన్న 10 మంది బందీలను విడుదల చేయాల్సి ఉండగా, మరణించిన 18 మంది మృతదేహాలను కూడా అప్పగించాల్సిన బాధ్యత ఉంది. ప్రతిగా ఇజ్రాయెల్ 60 రోజుల కాల్పుల విరమణ పాటించాల్సి ఉంటుంది. అలాగే, ఇజ్రాయెల్ వద్ద ఖైదీగా ఉన్న పలువురు పాలస్తీనా నివాసితులను విడుదల చేయడం కూడా ప్రతిపాదిత షరతుల్లో ఒకటి. అయితే, ఈ ప్రతిపాదనపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించలేదు.



ఇదిలా ఉండగా, మార్చి 18వ తేదీ నుంచి ఇజ్రాయెల్ తన దళాలతో గాజాలో దాడులు కొనసాగిస్తోంది. మే 19వ తేదీ తరువాత ఈ దాడులు మరింత తీవ్రతరం కాగా, ఇప్పటివరకు దాదాపు 4,000 మంది పౌరులు మృతి చెందినట్లు హమాస్ ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇజ్రాయెల్, ఖతార్, ఈజిప్ట్ మధ్య వర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ పరిణామాలతో మళ్లీ మొదటికి వచ్చింది. ప్రధాని నెతన్యాహూ గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించిన తర్వాత, ఇజ్రాయెల్ దాడులకు మరింత ఊపొచ్చింది. అంతేకాకుండా, వెస్ట్‌బ్యాంక్ పరిధిలో కొత్తగా 22 యూదు ఆవాసాల నిర్మాణానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే చట్టవిరుద్ధంగా నిర్మించిన కొన్ని అవుట్‌పోస్టులను కూడా చట్టబద్ధం చేయనుంది. ఈ నిర్ణయం పాలస్తీనా భవిష్యత్తుకు భారీ అడ్డంకిగా మారుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వ్యాఖ్యానించడం గమనార్హం. 1967 యుద్ధంలో ఆక్రమించిన వెస్ట్‌బ్యాంక్‌లో వేలాది యూదు నివాసాలను నిర్మిస్తూ, పాలస్తీనా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్న చర్యలు, ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన ఆశలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.




Politent News Web4

Politent News Web4

Next Story