పాకిస్థాన్ కి బిలియన్ డాలర్ల సాయాన్ని సమర్థించుకున్న ఐఎంఎఫ్

అప్పుల్లో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్కు బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సమర్థించుకుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశం ఈ రుణాన్ని పొందేందుకు అవసరమైన అన్ని లక్ష్యాలను చేరుకుందని ఐఎమ్ఎఫ్ వ్యాఖ్యానించింది. అందుకే ఈ తాజా రుణాన్ని అందించినట్లు స్పష్టం చేసింది. కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ కి ప్రపంచ బ్యాంక్ ఉద్దీపన ప్యాకేజీ రూపంలో భారీ ఊరటనిచ్చింది. ఉద్దీపన ప్యాకేజీ కింద 2 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే, ఐఎమ్ఎఫ్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడానికి అనుమతిస్తోందని, ఆ దేశానికి అందిస్తున్న ఆర్థిక సహాయం 'ఉగ్రవాదానికి పరోక్షంగా నిధులు సమకూర్చినట్లే' అవుతుందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 1 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) ఆ దేశానికి మంజూరయ్యాయి.
ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది.ఇక ఐఎమ్ఎఫ్ నిధులు విడుదల వేళ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్ చేసిన వైమానిక దాడుల్లో 14 మంది మసూద్ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు.ఈ క్రమంలో కేవలం మసూద్ కుటుంబానికి రూ.14 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. అదనంగా భారత్ దాడుల్లో ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మిస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు. కాగా, ఐఎంఎఫ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కార్యక్రమం కింద పాకిస్థాన్కు ఇప్పటివరకు రెండు విడతల్లో 2.1 బిలియన్ డాలర్లు అందజేసింది. గత ఏడాది ఈఎఫ్ఎఫ్ కింద 7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.
