Iran Refuses Talks: బెదిరింపులకు లొంగేది లేదు.. చర్చలు నిరాకరించిన ఇరాన్!
చర్చలు నిరాకరించిన ఇరాన్!

Iran Refuses Talks: పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరుగుతాయా లేదా అనేది ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై బెదిరింపులు మొదలుపెట్టిన నేపథ్యంలో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనాలు విధించడం ద్వారా ట్రంప్ దౌత్య సంబంధాలను దెబ్బతీశారని ఘాలిబఫ్ తీవ్రంగా ఆరోపించారు. టెహ్రాన్ను లొంగదీసుకోవాలనే ఉద్దేశ్యంతో యుద్ధాన్ని తిరిగి మొదలుపెట్టేందుకు ఈ చర్చలను ట్రంప్ ఒక సాకుగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే బెదిరింపుల మధ్య జరిగే ఏ రకమైన చర్చలనూ ఇరాన్ ఎప్పటికీ అంగీకరించదని ఘాలిబఫ్ హెచ్చరించారు. గత రెండు వారాలుగా యుద్ధంలో కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కూడా తెలిపారు.
ఈ చర్చల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మంగళవారం ఇస్లామాబాద్కు వెళ్లనున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఇరాన్ వైపు నుంచి భిన్న సంకేతాలు వస్తున్నాయి. అమెరికా దిగ్బంధనాలు ఎత్తివేసే వరకు చర్చల్లో పాల్గొనేది లేదని ఒక వర్గం చెబుతుండగా, మరో వర్గం చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు సిద్ధమవుతోందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాన్స్తో పాటు ఘాలిబఫ్ కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచించారు. “వారు కలవాలనుకుంటే మా దగ్గర చాలా సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ నేరుగా నన్నే కలవాలనుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. చర్చలు జరుగుతాయా లేదా యుద్ధం తిరిగి మొదలవుతుందా అనేది త్వరలోనే తేలనుంది.

