భారత్‌తో యుద్ధం తర్వాత పాక్‌ జెట్‌లకు డిమాండ్

Khawaja Asif’s Boasts: పాకిస్థాన్‌ నేతలు తమ దేశ సైనిక సామర్థ్యాలపై అతిగా ప్రగల్భాలు పలకడం సర్వసాధారణమే. అయితే, ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మీడియాతో మాట్లాడుతూ, భారత్‌తో జరిగిన యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు అపూర్వ డిమాండ్‌ వచ్చిందని, అవి హాట్‌కేకుల్లా విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై ఆర్థిక సమస్యలు తీర్చడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) రుణాలు కూడా అవసరం లేదని ఆయన పగటి కలలు కన్నారు.

గత ఏడాది మే నెలలో భారత్‌తో నాలుగు రోజుల పాటు సాగిన యుద్ధం తర్వాత పాకిస్థాన్‌కు రక్షణ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయని ఖవాజా ఆసిఫ్‌ వెల్లడించారు. "ఆరు నెలల తర్వాత మాకు ఐఎంఎఫ్‌ నుంచి రుణాల అవసరం ఉండకపోవచ్చు. మా సైనిక సామర్థ్యాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి" అని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు అందుకోవడానికి పాక్‌ ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ రుణాల కోసం సూచించిన సంస్కరణల్లో భాగంగా పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పిఐఏ)ను అమ్మకానికి సిద్ధమవుతోంది.

మరోవైపు, 2026-27 బడ్జెట్‌లో సబ్సిడీలు, సడలింపులు ఇవ్వాలని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఐఎంఎఫ్‌ను మినహాయింపులు కోరుతోందని స్థానిక మీడియా వెల్లడించింది. ఖవాజా ఆసిఫ్‌ చెప్పినట్టుగా పాక్‌ యుద్ధ విమానాలు జేఎఫ్‌-17, జే-10లకు ఆర్డర్లు ఇచ్చిన దేశాలు అజర్‌బైజాన్‌, లిబియా మాత్రమే. బంగ్లాదేశ్‌ ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ విమానాల్లో పాకిస్థాన్‌ తయారీ పరికరాలు తక్కువగా ఉండటం వల్ల, రష్యా, చైనా, ఇటలీ, తుర్కియే, యూకే వంటి దేశాల నుంచి భాగాలు తీసుకుంటున్నారు.

జేఎఫ్‌-17 ఇంజిన్‌ రష్యాది కాగా, డిజైన్‌ మరియు తయారీ చైనాది. దీంతో విక్రయాల నుంచి వచ్చే ఆదాయంలో పాక్‌ వాటా చాలా తక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ జేఎఫ్‌-17ను 15 మిలియన్‌ డాలర్లకు, జే-10ను 40 మిలియన్‌ డాలర్లకు విక్రయించినా, పాకిస్థాన్‌పై ఉన్న 300 బిలియన్‌ డాలర్ల అప్పుల భారాన్ని తగ్గించుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు పాక్‌ నేతల ఊహాగానాలకు అద్దం పడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story