26 గంటలు జర్నీ చేసి ఇండియా వచ్చా - మిస్ గ్రీస్ స్టెల్లా మాలో
హైదరాబాద్లో జరగుతున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు 26 గంటల పాటు ప్రయాణించి గ్రీస్ నుంచి వచ్చానని మిస్ గ్రీస్ స్టెల్లా మాలో చెప్పింది. తన దేశం నుంచి ఈ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు గర్వకారణంగా ఉందని, తాను ప్రస్తుతం ఇంటర్నేషనల్ హెలెనిక్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతూ మేకప్ ఆర్టిస్ట్రీ కూడా నేర్చుకుంటున్నానని తెలిపింది. మోడలింగ్ తన ప్రధాన వ్యాపారమే కాకుండా, జీవితంలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన రంగమని పేర్కొంది.
రామప్ప దేవాలయం సందర్శన సందర్భంగా చీర ధరించిన అనుభవాన్ని గుర్తు చేసుకొని ఉప్పొంగి పోయింది. రంగులతో కళకళలాడే చీరల డిజైన్లు తనను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలిపింది. తక్కువ స్పైసీగా తినే గ్రీక్ ప్రజలు.. తనను తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని, అయితే.. తాను భారతీయ వంటకాలను ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ముఖ్యంగా జాస్మిన్ రైస్తో తిన్న టేరియాకి వంటకం ఎంతో నచ్చిందని వివరించింది.
అయితే, ఇండియన్ సినిమా చూడటానికి తనకు అవకాశమే లేదని చెప్పింది. కానీ, బాలీవుడ్ డాన్సులు, సినిమాటిక్ మూవీస్ గురించి చాలా విన్నట్లు తెలిపింది. పేజెంట్ కోసం రోజువారీ కార్యక్రమాలు, చాలానే పనులతో బిజీగా ఉండడంతో సినిమాలు చూసేందుకు సమయం కుదరడం లేదంది. ప్రతిరోజూ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటినుంచి కొత్త జ్ఞాపకాలు దాచుకుంటున్నానని పేర్కొంది. ఉదయం 7 గంటలకు లేచి, తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల దాకా నిద్రపోకుండా ఉండే షెడ్యూల్లో ప్రస్తుతం జీవితం కొనసాగుతోందని, అయినా, ఆ అనుభవాలను తాను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నానంది.
తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి తనలో ఉందనీ, అయితే మాట్లాడడం కాస్త కష్టంగా అనిపిస్తోందని చెప్పింది. “నిజమైన వ్యక్తిగా ఉండండి, చిరునవ్వుతో జీవించండి, అది శుద్ధమైన ఆత్మవిశ్వాసానికి సంకేతం. మీరు వెలుగులు నింపే వ్యక్తులైతే, మీ చుట్టూ ఉన్నవారిని మీరు స్ఫూర్తి నింపగలుగుతారు. పాజిటివ్ ఎనర్జీతో జీవించండి, విశ్వాసం కలిగి ఉండండి” అని తన అభిమానులకు స్టెల్లా సందేశం ఇచ్చింది.
