బాలీవుడ్ నటులను గుర్తు పట్టలేనన్న మిస్ టునీషియా
తాను పెద్దగా బాలీవుడ్ సినిమాలు చూడలేదని, బాలీవుడ్ నటీ నటులను కూడా గుర్తు పట్టలేనని మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు వచ్చిన మిస్ టునీషియా లెమీ చెప్పింది. అయితే, వాళ్ల నటన, డ్యాన్స్ వంటివి అద్భుతంగా ఉంటాయని చెప్పింది.
మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం హైదరాబాద్ వచ్చిన ట్యునీషియా సుందరి లెమీ, తన అనుభవాలను పొలిటెంట్ మీడియాతో షేర్ చేసుకుంది. "నమస్తే వరల్డ్," అంటూ ఉత్సాహంగా మొదలుపెట్టిన లెమీ.. తాను ట్యునీషియానుంచి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పింది. హైదరాబాద్లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో పాల్గొనడం గొప్ప అనుభవమని, హైదరాబాద్కు వచ్చిన మొదటి క్షణాల నుంచే అద్భుత అనుభూతి కలిగిందని, భారతీయ సంప్రదాయ నృత్యాలు, సంగీతం, అతిథి సత్కారం అన్నీ మంత్ర ముగ్ధం చేసేలా ఉన్నాయని చెప్పింది.
భారతీయ భోజనాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పిన లెమీ, ట్యునీషియన్ వంటకాల్లో కనిపించే మసాలా రుచులకు ఇండియన్ ఫుడ్ కాస్త భిన్నంగా ఉందని అభిప్రాయపడింది. సోషల్ మీడియా ద్వారా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ లెమీ ధన్యవాదాలు తెలిపింది.
