Nepal: నేపాల్ సంక్షోభం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వెనక హిందూ రాజు ఫొటో... ఇది ఏదికి సంకేతం?
ఇది ఏదికి సంకేతం?

Nepal: నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలైన జెన్-జెడ్ ఉద్యమం, అవినీతిపై ఆందోళనగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా, మంగళవారం నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వెనక కనిపించిన హిందూ రాజు ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం ద్వారా ఆయన ఏదైనా సందేశం ఇవ్వాలని ప్రయత్నించారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఆ చిత్రంలో 18వ శతాబ్దానికి చెందిన రాజు పృథ్వీ నారాయణ్ షా ఉన్నారు. ఈ ఫొటోను ‘పెద్ద సంకేతం, పెద్ద ప్రకటన’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. నేపాల్ను చివరిగా పాలించిన ‘షా’ రాజవంశం 2008లో మావోయిస్టుల తిరుగుబాటుతో ముగిసింది. అప్పటి రాజు జ్ఞానేంద్ర షా గద్దె దిగడంతో రెండున్నర శతాబ్దాల హిందూ రాజవంశ పాలన ముగిసి, ప్రజాస్వామ్యం స్థాపితమైంది. అయితే, గత 17 ఏళ్లలో 14 సార్లు ప్రభుత్వాలు మారడంతో రాజకీయ అస్థిరత, అవినీతి, బంధుప్రీతిపై ప్రజల్లో విసుగు నెలకొంది.
ఈ నేపథ్యంలో రాచరికం పునరాగమనంపై చర్చలు మొదలయ్యాయి. ఆర్మీ చీఫ్ వెనక కనిపించిన ఈ చిత్రం రాచరిక పునరుద్ధరణకు సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేపాల్లో హిందూ రాజుల పాలన తిరిగి వస్తుందా అని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే, రాజకీయ విశ్లేషకులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నేపాల్ ఆర్మీలో పృథ్వీ నారాయణ్ షాకు ప్రత్యేక స్థానం ఉంది. గోర్ఖా ప్రిన్సిపాలిటీలో జన్మించిన ఆయన, 20 ఏళ్ల వయసులో అధికారం చేపట్టి, ఆధునిక నేపాల్ రూపశిల్పిగా పేరు గడించారు. ఆర్మీకి చెందిన అనేక కార్యక్రమాలు, సంస్థలు, మౌలిక సదుపాయాలు ఆయన పేరుతోనే ఉన్నాయి. గత ఏడాది సిగ్దెల్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇలాంటి చిత్రం బ్యాక్గ్రౌండ్లో కనిపించింది. అయితే, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈ ఫొటో మళ్లీ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఏడాది మొదట్లో నేపాల్లో రాచరిక పాలనకు మద్దతుగా రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫొటోతో పాటు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలు కూడా ప్రదర్శించారు. జ్ఞానేంద్ర షాతో యోగికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇతర దేశ నాయకుల చిత్రాలను ప్రదర్శించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత రాజకీయ అస్థిరత, అవినీతిపై నిరసనల నేపథ్యంలో జ్ఞానేంద్ర షా తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు, దీంతో రాచరిక అనుకూల ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.
