Oil Tanker Explosion: హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ పేలుడు.. చర్చలకు ఇరాన్ మూడు షరతులు
చర్చలకు ఇరాన్ మూడు షరతులు

Oil Tanker Explosion: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాలుగా కొనసాగుతున్న ఘర్షణలకు తాత్కాలిక విరామం ఏర్పడినప్పటికీ, ఈ ఘటనతో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదని స్పష్టమవుతోంది.
ఇరాన్ నిర్దేశించిన జలమార్గం కాకుండా మరో దారిలో వెళ్లిన ట్యాంకర్ సీమైన్ను ఢీకొని పేలిపోయినట్లు ఇరాన్ మీడియా సంస్థ తస్నిమ్ ధ్రువీకరించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
చర్చలు కొనసాగించేందుకు ఇరాన్ మూడు షరతులు విధించింది. హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ధ్రువీకరించాలని, ఫ్రీజ్ చేసిన నిధులను విడుదల చేయాలని, ఆ తర్వాతే అణు సమస్యపై చర్చలు ప్రారంభించాలని టెహ్రాన్ కోరుతోంది. ప్రత్యామ్నాయ మార్గాల ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది.
అదే సమయంలో హర్మూజ్ జలసంధికి ఇరువైపులా ఉన్న ఇరాన్, ఒమన్ దేశాలు రుసుము విషయంపై చర్చలు జరుపుతున్నాయి. తమ సార్వభౌమాధికారానికి నష్టం లేకుండా, వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు.

