Pakistan PM Meets Trump: ట్రంప్ను కలిసిన పాక్ ప్రధాని.. మీడియాకు అనుమతి లేకుండానే భేటీ!
మీడియాకు అనుమతి లేకుండానే భేటీ!

Pakistan PM Meets Trump: అమెరికా, పాకిస్థాన్ల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. షరీఫ్తో పాటు మునీర్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.
అమెరికా సమయం ప్రకారం గురువారం సాయంత్రం 4.52 గంటలకు షరీఫ్ బృందం వైట్హౌస్ చేరుకుంది. అప్పుడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండటంతో, పాక్ నేతలు దాదాపు గంటసేపు ఎదురుచూడాల్సి వచ్చింది. మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ షరీఫ్ను ప్రశంసించారు. ఆయన గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి అని చెప్పారు. తర్వాత ఓవల్ ఆఫీసుకు వెళ్లి షరీఫ్తో భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, ఈ భేటీలో ఏ అంశాలు చర్చించారనేది స్పష్టంగా తెలియలేదు.
షెహబాజ్ షరీఫ్ ట్రంప్తో భేటీ కావడం ఇదే మొదటిసారి. 2019లో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. అంతకుముందు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 2015లో అమెరికా పర్యటన చేశారు. ఇటీవల మునీర్ అమెరికా వెళ్లినప్పుడు వైట్హౌస్లో విందు ఏర్పాటు చేశారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు జరగడం ఆసక్తికరం.
